మనసు మూగదనుచు జాలి మానగవలెనోయి! మూగ
తనమేమొ, మనుజుని తనదు దారినిఁ గొనిపోవుచుండు,
కనుమయ్య! కట్టివేయగల కాఠిన్యమొకయింత లేక
మునుగుచునుందురు జగతి, మోహపు సాగరమందు.
ఎల్ల మరచి యాటపాటలేను గొప్పవటంచు నుంద్రు
కల్ల కపటములు లేని కలకల నగవుల బాల్య
మెల్ల, పిదప లోకములను మిగుల బాగుపరచ కాల
మెల్ల గడుపుచుందు,రేమి మేళులు చేయగ జాలు?
నిజమునెరుగునంతలోన నేల విడుచుకాలమౌను,
సజలనయనములతోడ శంకరుని పదము చేరి,
భజన చేయుచు వేడుకొంద్రు పాహి పాహియనుచు, నిట్టి
ప్రజలకు బుద్ధినిఁ గలిగి బ్రదుక, వరములియ్యవయ్య!
తొలగించగా యీతి బాధ తుదకైన కరుణించవేమి?
శిలవోలె నిలిచితి జాలి చిలుకంగ రావే యదేమి?
కలనైనఁ గనిపించి దారి కానగఁ జేయుమో స్వామి!
యిలపైన వేసట గలిగె యెప్పుడు పిలిపింతువేమి?
పశువునుఁ గాటన కట్టుపగిదిని నేర్పరాదొక్కొ!
నిశియందునహమందు నెపుడు నీమ్రోల నుంచరాదొక్కొ!
వశుడవీవంద్రు భక్తులకు భాగ్యమదియెగదమాకు,
పశుపతీ! దయజూడవయ్య! పరితపించెడు వారిపైన.
----లక్ష్మీదేవి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి