పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
ఆది శంకరాచార్యులవారు చెప్పిన ఈమాటలో ఎంత అర్థం ఉందో!
మళ్ళీ పుట్టుక మళ్ళీ చావుమళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ తల్లి కడుపులో శయనం. ఇది ఒక చక్రం. తిరుగుతూనే ఉండాలి.
లేకపోతే సృష్టి క్రమం ఆగిపొతుంది.
ఇవన్నీ నేను కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు కావని నాకూ తెలుసు. అందరికీ తెలిసినవేనని తెలుసు.
అయినా తమకు చావు వస్తుందేమోనని ఎందుకూ భయపడటం?
మాకు తెలిసినావిడ 102 ఏళ్ళ వయసులో నిన్ననే పొయారు.
సుమారు ఐదారేళ్ళుగా తానెవరో ఎదుటివాళ్ళెవరో తెలీకుండా, కొడుకు కలిపి నొట్లొ పెడితే అర ఇడ్లీ లేదా అంత కొంచెం ఆహారం మాత్రమే తినగలుగుతూ మంచంలో ఉన్నావిడ. ఆవిడ పోతే పాపం ఇన్నేళ్ళకు ఆ ఆత్మ కు విముక్తి లభించింది అనిపించింది.
ఈ జర్జర దేహాన్ని వదిలి హాయిగా అనంత లోకాల్లో కలిసిపోయింది.
ఇది జర్జర దేహమే అని తెలిసినప్పుడు ఎప్పుడు పోతే ఏం?
చక్కటి ఆరోగ్యంతో నవనవలాడుతూ బంతిపూవులా ఉన్నప్పుడు ఏ హార్ట్ ఎటాక్ తోనో, ఏ ప్రమాదంలోనో పోతే మిగిలిన వాళ్ళంతా అయ్యో పాపం అని ఎందుకంటారు? కాళ్ళు చేతులు విరిగితేనో,కళ్ళు పోతేనో,నయం కాని దీర్ఘ వ్యాధి బారిన పడితేనో సంతాపం, సానుభూతి కలిగితే సరే కాని మరణిస్తే ఎందుకు సానుభూతి?
ఈ లోకంలో
అసూయా ద్వేషాల పంకిలంలో
కామక్రోధాగ్నిలో
కష్టనష్టాల సుడిగుండంలో
పడి కొట్టుకుంటూ ఉండటం కన్న మరణం భయంకరమైనదా? ఎంత మాత్రం కాదు. అది ఒక ఆత్మకు విముక్తి. జర్జర దేహం ఎప్పుడు వదిలేసినా ఒకటే
మంచి పండు రాలి పడితే కొన్ని మొక్కలు మొలకెత్తుతాయి.
దెబ్బతిన్న, కుళ్ళిపోయిన పండైతే నేల సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.అంతే తేడా.
ఏదో నాకు తోచింది చెప్పాను. తప్పులుంటే విజ్ఞులు దిద్దవలసిందిగా వేడుకోలు.